అనంతపురం ఆర్టీవో కార్యాలయం వద్ద భారీ పేలుడు
అనంతపురం ఆర్టీవో కార్యాలయం వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీ బాలాజీ స్టిక్కర్స్ ప్రేయర్స్ దుకాణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పదేళ్ల క్రితం నాటి పెయింట్ డబ్బాలు ఓపెన్ చేస్తూండగా పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో సతీష్ అనే వాచ్ మెన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ పేలుడుతో అనంతపురం నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఇక్కడ గత 9 రోజులుగా గోడౌన్ ఏర్పాటు చేసుకుని స్ప్రే అమ్మకాలతో పాటు పేయింట్కు సంబంధించిన కార్యకలాపాలు కూడా చేస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా వాడని పేయింట్ డబ్బాలు ఉన్నాయి. వాటిని సమీపంలో ఉన్న అపార్టుమెంట్ వాచ్మెన్కు అమ్ముకోమని షాపు యజమాని చెప్పారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం పెయింట్ డబ్బాలు తెరుస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో వాచ్మెన్ సతీష్ శరీరం ముక్కలైపోయింది. శరీర భాగాలు 30 అడుగుల దూరంలో ఎగిరిపడ్డాయి. దీంతో సంఘటనా స్థలంలో పూర్తిగా భయానక వాతావరణం నెలకొంది. షాపు యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.