వాట్సాప్‌లో శరద్ పవార్‌కు హత్య బెదిరింపులు.. సుప్రియా సూలే

Received threat for Sharad Pawar on WhatsApp, says Supriya Sule

ముంబయిః నేషనలిస్ట్‌ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్‌ కు బెదిరింపులు వచ్చాయి. పవార్‌ను చంపేస్తామంటూ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. వెంటనే అప్రమత్తమైన పవార్‌ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే నేతృత్వంలోని పార్టీ నేతలు ముంబయి పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. బెదిరింపులు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా సుప్రియా సూలే మాట్లాడుతూ.. ‘పవార్ సాహెబ్ కోసం నా వాట్సాప్‌కు మెసేజ్ వచ్చింది. అది బెదిరింపు సందేశం. ఓ వెబ్‌సైట్‌ ద్వారా నా తండ్రి పవార్‌ను బెదిరించారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించాను. ముంబయి పోలీసు కమిషనర్‌ను కలిసి ఈ విషయాన్ని తెలియజేశాను. ఘటనపై ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరాను. శరద్‌ పవార్‌కు ఏదైనా జరిగితే రాష్ట్ర హోం మంత్రి బాధ్యత వహించాలి. ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర హోం మంత్రి జోక్యం చేసుకోవాలి’ అని ఆమె డిమాండ్‌ చేశారు.