రామగుండం మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం

రామగుండం మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. కాలేజీ లో కొందరు సీనియర్ విద్యార్థులు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న జూనియర్ విద్యార్థులకు అమానుషంగా గుండు కొట్టించారు. అనంతరం బలవంతంగా వారి మీసాలను కూడా ట్రిమ్మర్‌తో షేవ్ చేశారు. ఈ క్రమంలో తమను వదిలేయండన్నా.. అంటూ ప్రాధేయపడినా సీనియర్లు వినలేదని బాధిత విద్యార్థులు వాపోయారు. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులు గోదావరి ఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. ర్యాగింగ్‌కు పాల్పడిన నలుగురు విద్యార్థులపై పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ క్రమంలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వైస్ ప్రిన్సిపాల్ ఛాంబర్ ఎదట ఆందోళనకు దిగారు. ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్లపై పోలీసుల చేత విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై శాసనమండలిలో చర్చించాలని కోరుతూ మండలి చైర్మన్‌కు లేఖ రాశారు. ర్యాగింగ్‌ అనేది అమానవీయమని, మానవ హక్కుల ఉల్లంఘన అని కవిత వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలని డిమాండ్‌ తన లేఖలో వ్యక్తం చేసారు.