అనేక మందిని హత్య చేయించిన చరిత్ర ఈటెల రాజేందర్ ది – పాడి కౌశిక్ రెడ్డి
టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మరోసారి హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఫై నిప్పులు చెరిగారు. అనేక మందిని హత్య చేయించిన చరిత్ర ఈటెల రాజేందర్ ది అంటూ కీలక ఆరోపణలు చేసారు. తాను చేసిన ఆరోపణలు అబద్ధమైతే ముక్కు నేలకు రాయడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. బుదవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ..ఈటల రాజకీయ జీవితమంతా హత్యా రాజకీయాలతో ముడిపడి ఉందని, నర్సింగాపూర్లో ఈటలపై గ్రామస్థులు చెప్పులతో దాడి చేసింది నిజం కాదా అని , తెలంగాణ ఉద్యమకారుడు ప్రవీణ్ యాదవ్పై ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడు దాడి చేయించింది నిజం కాదా? అని ప్రశ్నించారు.
25 రోజుల క్రితం మల్లయ్యపై దాడి చేయించింది కూడా ఈటలేనని అన్నారు. ఈ రక్త చరిత్రపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అని ఈటల రాజేందర్కు కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ది హత్యా రాజకీయాల సంస్కృతి కాదని.. ఆయన ప్రత్యర్థులు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారని గుర్తుచేశారు. ఈటల రాజేందర్ మాటిమాటికి కేసీఆర్తో పోల్చుకునే ప్రయత్నం చేస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈటలకు కేసీఆర్కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. ఈటల మంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఏ పద్ధతులు ఉన్నాయో.. ఇప్పుడు కూడా అవే పద్ధతులు అమల్లో ఉన్నాయని గుర్తుచేశారు. అన్నం పెట్టిన కేసీఆర్కు అసెంబ్లీ పద్ధతులు మారుస్తారా అంటూ అగ్రహం వ్యక్తం చేశారు.