రాజ్యసభ స్థానాలకు ప్రారంభమైన పోలింగ్
న్యూఢిల్లీః కాస్-ఓటింగ్ భయాల మధ్య దేశవ్యాప్తంగా రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 15 రాష్ట్రాల్లో ఏప్రిల్ 2, 3 తేదీల్లో 56 స్థానాలు ఖాళీ అవనుండగా 41 స్థానాల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో ఈ రోజు (మంగళవారం) 15 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలు, కర్ణాటకలో 4 సీట్లు, హిమాచల్ప్రదేశ్లోని ఒక స్థానానికి ఉదయం 9 గంటలకు పోలింగ్ షురూ అయింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ రోజే సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలుకానుంది.
కాగా, ఏకగ్రీవమైన 41 మంది రాజ్యసభ ఎంపీల్లో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, బిజెపి చీఫ్ జేపీ నడ్డా, అశోక్ చవాన్, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ఎల్ మురుగన్తో పాటు పలు పార్టీలకు చెందినవారు ఉన్నారు. బిజెపి అత్యధికంగా 20 సీట్లను ఏకగ్రీవం చేసుకుంది. ఆ తర్వాత కాంగ్రెస్-6, తృణమూల్ కాంగ్రెస్ -4, వైఎస్ఆర్ కాంగ్రెస్-3, ఆర్జేడీ -2, బీజేడీ 2, ఎన్సీపీ, శివసేన, బిఆర్ఎస్, జేడీయూ పార్టీలు ఒక్కొక్క స్థానం చొప్పున ఏకగ్రీవం చేసుకున్నాయి. ఆయా స్థానాల్లో ఒకటికి మించి నామినేషన్లు దాఖలు దాఖలు కాకపోవడంతో సంబంధిత అభ్యర్థులను విజేతలుగా రిటర్నింగ్ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే.