ఖమ్మం లేదా భువనగిరి నుంచి రాహుల్ గాంధీ పోటీ..?

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి లోక్ సభ కు పోటీ చేయనున్నట్లు సమాచారం. ఖమ్మం లేదా భువనగిరి నుంచి బరిలో దిగుతారని తెలుస్తోంది. సోనియా ఖమ్మంలో పోటీ చేయాలని గతంలో టీపీసీసీ తీర్మానం చేసింది. కానీ ఆరోగ్యం, వయసు రీత్యా ఆమె రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఇక రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా ఉన్నారు. అక్కడ వయనాడ్ స్థానంలో కమ్యూనిస్టు పార్టీలు పోటీ చేయనున్నారు. అందుకే ఈ సారి .. తెలంగాణ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే రాహుల్ టీం .. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యులతో సంప్రదింపులు జరిపింది. సర్వే రిపోర్టులు ఇతర అంశాలతో రెండు స్థాలను ఎంపిక చేసుకున్నారు. అందులో ఒకటి ఖమ్మం కాగా మరొకటి భువనగిరి. రెండు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలే. అయితే ఖమ్మం ఇంకా బలమైన సీటు. అక్కడ కాంగ్రెస్ కు ఇప్పుడు సరైన ప్రత్యర్థి లేదు. బీఆర్ఎస్ నుంచి నేతల వలసతో ఆ పార్టీ పూర్తిగా బలహీనపడింది. ద్వితీయ శ్రేణి క్యాడర్ కూడా పార్టీ మారిపోయింది. బీజేపీ ఉనికి దాదాపుగా లేదు. దీంతో ఖమ్మంలోనే రాహుల్ పోటీ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. రాహుల్ పోటీ చేస్తే ఎన్నికల్లో మరింత ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ నేతల అంచనా. ఈ విషయంపై AICC చీఫ్ ఖర్గేతో CM రేవంత్ చర్చించారని, దీంతో రాహుల్ అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.