భారత్, రష్యా.. పలు రక్షణ ఒప్పందాలపై సంతకాలు
న్యూఢిల్లీ : రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రష్యా రక్షణ మంత్రి జనరల్ సెర్గీ షొయిగుల మధ్య పలు రక్షణ ఒప్పందాలు జరిగాయి. ఆ ఒప్పందాలపై వారు సంతకాలు చేశారు. 7.63x39mm క్యాలిబర్ కలిగిన ఏకే-203 అజాల్ట్ రైఫిళ్ల తయారీ అంశంలోనూ ఇద్దరు రక్షణ మంత్రులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం సుమారు ఆరు లక్షల ఏకే-203 రైఫిళ్లను తయారీ చేయనున్నారు. 2021 నుంచి 2031 మధ్య కాలంలో ఆ ఆయుధాలను సమీకరించనున్నారు. కలష్నికోవ్ ఆయుధాల తయారీ గురించి 2019, ఫిబ్రవరిలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఏకే-203 రైఫిళ్లను తయారీ చేయనున్నారు. రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, రష్యా రక్షణ మంత్రి జనరల్ సెర్గీ షోయిగు, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది.
ఇటీవల కాలంలో ఇండియా, రష్యా మధ్య రక్షణ రంగ సహకారం అసాధారణ రీతిలో ప్రగతి సాధఙంచినట్లు రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సవాళ్లతో కూడిన ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా అతిపెద్ద భాగస్వామిగా ఉంటుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య రక్షణ సహకారం చాలా కీలకమైందని, రెండు దేశాలు ప్రాంతీయ భద్రతను మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తాయని ఆశిస్తున్నట్లు రష్యా రక్షణ మంత్రి తెలిపారు. భారత్, రష్యా మధ్య ఉన్న బంధం దృఢంగా, స్థిరంగా ఉన్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/