‘రాజధాని ఫైల్స్’ సినిమా విడుదలకు ఏపీ హైకోర్టు అనుమతి
అమరావతిః ‘రాజధాని ఫైల్స్’ సినిమా విడుదలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రివైజింగ్ కమిటీ అన్ని సర్టిఫికెట్లు పరిశీలించాకే ధ్రువపత్రం జారీ చేసిందని స్పష్టం చేసింది. సీఎం జగన్, ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ఈ సినిమాను తీశారని.. గతేడాది డిసెంబర్ 18న సీబీఎఫ్సీ జారీ చేసిన ధ్రువపత్రాన్ని రద్దు చేయాలంటూ వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఇటీవల హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ నెల 13న విచారణ జరిపిన కోర్టు.. సినిమా ప్రదర్శనను తాత్కాలికంగా నిలువరిస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తాజాగా శుక్రవారం విచారణ చేపట్టి ‘రాజధాని ఫైల్స్’ చిత్రం విడుదలకు అంగీకారం తెలిపింది.