రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు.. 1.30 గంటలకల్లా 40.27 పోలింగ్ శాతం ఓటింగ్
జైపూర్: రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు రాష్ట్రంలోని 199 స్థానాల్లో సగటున 40.27 శాతం పోలింగ్ నమోదైంది. ఈ విషయాన్ని ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుందని, ఐదింటి లోపు క్యూలైన్లలో నిలబడి ఉన్న అందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు.
కాగా, రాజస్థాన్లోని మొత్తం 200 అసెంబ్లీ స్థానాలకుగాను ఇవాళ 199 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పోలింగ్ జరుగుతున్నది. కరన్పూర్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్సింగ్ కూనర్ మరణించడంతో అధికారులు ఆ నియోజకవర్గంలో ఎన్నికను వాయిదా వేశారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేశామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.