లచ్మన్గర్ నుంచి రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దొతసారా నామినేషన్
జైపూర్: రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మరింత ఊపందుకుంది. అక్టోబర్ 30న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ నెల 6వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దొతసారా లచ్మన్గర్ అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. తన అనుచరులతో కలిసి వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
కాగా, నవంబర్ 6 వరకు నామినేషన్లను స్వీకరించి 7న స్క్రూటినీ నిర్వహించనున్నారు. నవంబర్ 9 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. రాజస్థాన్ రాష్ట్రమంతలా ఒకే విడతలో నవంబర్ 25న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అశోక్ గెహ్లాట్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది.