టైలర్ కన్హయ్య లాల్ హంతకులకు బిజెపితో సంబంధాలున్నాయిః సీఎం గెహ్లాట్ ఆరోపణలు

Rajasthan CM Ashok Gehlot claims Udaipur tailor Kanhaiya Lal’s killers linked to BJP

జోద్‌పూర్‌: రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కీల‌క ఆరోప‌ణ‌లు చేశారు. ఉద‌య్‌పూర్‌లో హ‌త్య‌కు గురైన టేల‌ర్ క‌న్హ‌య్య లాల్‌ను చంపిన వారికి బిజెపితో సంబంధాలు ఉన్న‌ట్లు ఆయ‌న ఆరోపించారు. న‌వంబ‌ర్ 25వ తేదీన జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌లకు ముందు రాష్ట్రంలో మ‌త‌క‌ల‌హాల‌ను సృష్టించేందుకు బిజెపి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. జోద్‌పూర్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఎన్ఐఏ బ‌దులుగా రాజ‌స్థాన్ స్పెష‌ల్ ఆప‌రేష‌న్స్ గ్రూప్ ఆ కేసును ద‌ర్యాప్తు చేప‌డితే, ఎప్పుడో ఆ కేసు ప‌రిష్కారం అయ్యేద‌ని గెహ్లాట్ పేర్కొన్నారు.

స‌స్పెన్ష‌న్‌కు గురైన బిజెపి నేత నుపుర్ శ‌ర్మ చేసిన వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్ధించిన టేల‌ర్ క‌న్హ‌య్య‌ను ఇద్ద‌రు వ్య‌క్తులు గ‌త ఏడాది జూన్ 28వ తేదీన త‌ల‌న‌రికేసి చంపిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌ దేశ‌వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది. తొలుత ఆ కేసును ధ‌న్‌మండి పోలీసు స్టేష‌న్‌లో న‌మోదు చేశారు. ఆ త‌ర్వాత ఎన్ఐఏకు బ‌దిలీ చేశారు. క‌న్హ‌య్య హ‌త్య కేసులో ఎన్ఐఏ ఎటువంటి చ‌ర్య‌లు తీసుకున్న‌దో తెలియ‌ద‌ని, కానీ ఒక‌వేళ ఎస్వోజీ ఆ కేసును ద‌ర్యాప్తు చేస్తే, ఇప్ప‌టికే నిందితుల‌కు శిక్ష ప‌డేద‌ని సీఎం గెహ్లాట్ పేర్కొన్నారు.

కేసుతో సంబంధం ఉన్న రియాజ్ అక్త‌రి, గౌస్ మ‌హ‌మ్మ‌ద్‌ల‌ను అరెస్టు చేశామ‌ని, ఆ నిందితుల‌కు బిజెపి తో లింకులు ఉన్నాయ‌ని, హ‌త్యా ఘ‌ట‌న‌కు కొన్ని రోజుల ముందు ఆ ఇద్ద‌రూ మ‌రో కేసులో అరెస్టు అయ్యార‌ని, అయితే ఆ ఇద్ద‌ర్నీ బీజేపీ నేత‌లే వ‌చ్చిన పోలీసు స్టేష‌న్ నుంచి విడిపించిన‌ట్లు సీఎం గెహ్లాట్ తెలిపారు. ఎన్నిక‌ల్లో ఓడిపోతామ‌న్న భ‌యంతోనే బిజెపి జిమ్మిక్కులు చేస్తోంద‌ని సీఎం గెహ్లాట్ చెప్పారు.