BRS కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే – రాహుల్

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండడం తో అన్ని పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. నేడు కాంగ్రెస్ పార్టీ బస్ యాత్ర చేపట్టింది. రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీలో ఈ యాత్ర లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ములుగు లో కాంగ్రెస్ విజయభేరీ సభ నిర్వహించారు.

ఈ సభలో రాహుల్ మాట్లాడుతూ..తెలంగాణలో దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని కీలక వ్యాఖ్యలు చేసారు. అభివృద్ధి అనే గ్యారంటీతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందన్నారు. బీఆర్ఎస్‌కు రోజులు చెల్లాయని.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఎన్నో హామీలను అమలు చేయకుండా మోసం చేశారని మండిపడ్డారు. దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారని , ధరణి పోర్టల్ అవినీతి, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా వేల కోట్లు జేబుల్లో వేసుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఇస్తామన్న మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం ఎవరికి అయిన వచ్చాయా అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికలలో మీరు BRS కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని రాహుల్ అన్నారు.

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆదివాసీల బిల్లు ఆమోదించాం. కాంగ్రెస్ ఇస్తున్న హామీలను నిలబెట్టుకుంటుంది. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలకు నెలకు రూ.2500 ఇస్తాం. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం. భూమి లేని రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తాం. కరెంట్ బిల్లుల్లో 200 యూనిట్లు ఉచితంగా ఇస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.4 వేల పింఛన్ ఇస్తాం. యువతీ యువకులకు 5 లక్షల ఆర్థిక సాయం చేస్తాం. సమ్మక్క-సారలమ్మ ఉత్సవాన్ని జాతీయ ఉత్సవంగా చేస్తాం. కుంభమేళా తరహాలో చేస్తాం అని హామీ ఇచ్చారు.