జోడో యాత్రలో అరుదైన ఘటన : చిన్నారులతో కలిసి రాహుల్ పరుగు

రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఐదో రోజు యాత్రలో భాగంగా ఆదివారం ఉదయం జడ్బర్లలో రాహుల్ తన పాదయాత్రను కొనసాగించారు. యాత్రలో నడుస్తున్న రాహుల్ వద్దకు కొంతమంది చిన్నారులు వచ్చారు. ఇంతలో మనం పరుగెదామా.. రెడీ వన్ టు త్రీ అంటూ ఆయన పరుగు పెట్టారు. రాహుల్ ను చూసి పక్కనే ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పరుగు పెట్టారు. ఈ ఘటన అందర్నీ ఆశ్చర్య పరిచింది.

ఈరోజు గొల్లపల్లి నుంచి ప్రారంభమైన యాత్ర రాజాపూర్, బాలానగర్ మీదుగా.. అన్నారం గేట్, షాద్ నగర్ వరకు కొనసాగనుంది.. బాలానగర్ జంక్షన్ దగ్గరున్న అయ్యప్పస్వామి టెంపుల్ దగ్గర మార్నింగ్ బ్రేక్ ఇవ్వనున్నారు. సాయంత్రం 4గంటలకు బాలానగర్ జంక్షన్ దగ్గర నుంచి తిరిగి యాత్ర ప్రారంభం కానుంది. ఏడు గంటలకు షాద్ నగర్ బైపాస్ దగ్గరున్న అన్నారం గేట్ వద్ద రాహుల్ మాట్లాడనున్నారు. షాద్ నగర్ దగ్గరున్న ఫరూక్ నగర్ లో నైట్ హాల్ట్ ఏర్పాటు చేశారు. మొత్తం ఈరోజు 22 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగనుంది.