నగరాలను చెత్త రహితంగా చేయడమే స్వచ్ఛభారత్ మిషన్ 2.0 లక్ష్యం
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ఇవాళ స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్ 2.0, అమృత్ 2.0 కార్యక్రమాలను ప్రారంభించారు. నగరాలను చెత్త రహితంగా చేయడమే స్వచ్ఛభారత్ మిషన్ 2.0 లక్ష్యమని ఆయన తెలిపారు. రెండవ దశతో సీవేజ్ మేనేజ్మెంట్పై కూడా దృష్టి పెట్టినట్లు ఆయన చెప్పారు. నగరాలన్నింటిలో నీటి సంరక్షణ చర్యలు కూడా చేపడుతామన్నారు. బురద నీరు చెరువుల్లో చేరకుండా చర్యలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను అందుకోవడంలో స్వచ్ఛభారత్ మిషన్ 2.0 కీలకంగా నిలుస్తుందని ప్రధాని తెలిపారు. పట్టణాభివృద్ధి వల్లే సమానత్వం సాధ్యమవుతుందన్నారు.
స్వచ్ఛభారత్ రెండవ దశలో భాగంగా నగరాల్లో ఉన్న చెత్త గుట్టలను ప్రాసెస్ చేసి తొలగించనున్నట్లు ప్రధాని తెలిపారు. ఢిల్లీలో ఉన్న ఓ గార్బేజ్ ప్రదేశాన్ని శుభ్రం చేయనున్నట్లు ఆయన చెప్పారు. ప్రతి రోజు దేశంలో లక్ష టన్నుల చెత్తను ప్రాసెసింగ్ చేస్తున్నట్లు ప్రధాని చెప్పారు. 2014లో స్వచ్ఛ భారత్ మొదలు పెట్టిన సమయంలో కేవలం 20 శాతం మాత్రమే చెత్తను శుద్ధి చేసేవారని, ఇప్పుడు 70 శాతం చెత్తను ప్రతి రోజు ప్రాసెస్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దాన్ని వంద శాతానికి తీసుకురావాలని ప్రధాని చెప్పారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/