17 న తెలంగాణ లో పర్యటించబోతున్న రాహుల్

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ మరోసారి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఈసారి తెలంగాణ లో ఎలాగైనా కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని అధిష్టానం గట్టిగా ఫిక్స్ అయ్యింది. ఈ తరుణంలో పక్క ప్రణాళికలతో ముందుకు వెళ్తూ ఓటర్లను ఆకట్టుకుంటుంది. ఇతర పార్టీల నేతలను రాబట్టుకోవడంలో సక్సెస్ అయినా కాంగ్రెస్..మేనిఫెస్టో తో మరింత గా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ప్రచారంలో కూడా దూసుకెళ్తుంది. లోకల్ నేతలే కాకుండా జాతీయ స్థాయి నేతలను సైతం రంగంలోకి దింపి ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.

ఇప్పటికే రాహుల్ , ప్రియాంక గాంధీ లు పలు పర్యటనలు చేయగా..మరోసారి వీరిద్దరూ ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఈ నెల 17న రాహుల్ గాంధీ రానుండగా.. ఈ నెల 20న ప్రియాంకగాంధీ రానున్నారు. ఇదే సమయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునతోపాటు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌ సీఎంలు కూడా ప్రచారం కోసం తెలంగాణలో పర్యటించనున్నారు.

ఈ నెల 17న తెలంగాణకు రానున్న రాహుల్‌గాంధీ ఆరురోజులపాటు ఇక్కడే మకాం వేసి ప్రచారంలో బిజీకానున్నారు. అదే రోజు వరంగల్‌, పాలకుర్తి, భువనగిరి నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఆ తర్వాత ఐదు రోజులపాటు ఏ నియోజకవర్గాల్లో ప్రచారం చేపట్టాలన్న షెడ్యూల్‌పై రాష్ట్ర నేతలు కసరత్తు చేస్తున్నారు. రాహుల్‌గాంధీ ప్రచారంలో భాగంగా నిరుద్యోగులతో భేటీకానున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని నిరుద్యోగులు కొందరు రెండు బృందాలుగా ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో 10 రోజులపాటు నిరుద్యోగ చైతన్యం పేరుతో బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్రలో రాహుల్‌గాంధీ పాల్గొనే అవకాశం ఉంది.

ఇక రాహుల్‌ పర్యటన సమయంలోనే ప్రియాంకగాంధీ కూడా తెలంగాణకు రానున్నారు. ఈ నెల 20 తర్వాత సుడిగాలి పర్యటనలతో రాష్ట్రంలోని పలుచోట్ల 5 రోజులపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునతోపాటు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌ సీఎంలు కూడా ప్రచారం కోసం తెలంగాణకు రానున్నారు. వీరి టూర్‌ షెడ్యూల్‌ ఒకటి రెండు రోజుల్లోనే ఖరారుకానుంది.