బ్రిటన్ లో పర్యటించనున్న రాహుల్ గాంధీ

రీసెంట్ గా భారత్ జోడో యాత్ర పూర్తి చేసుకున్న రాహుల్ గాంధీ..ఇప్పుడు బ్రిటన్ లో పర్యటించబోతున్నారు. భారత్‌ జోడో యాత్ర లో రాహుల్‌ 12 రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతం గుండా సుమారు 4వేలకు పైగా కిలోమీటర్లు నడిచారు. గత సెప్టెంబరు 7న కన్యాకుమారి నుంచి ప్రారంభించిన భారత్‌ జోడో యాత్ర.. 75 జిల్లాల్లో 4,080 కిలోమీటర్ల దూరం కొనసాగింది. ఈ యాత్ర 135 రోజుల పాటు కొనసాగి.. గత నెల 29న కశ్మీర్‌లో యాత్ర ముగిసింది. ప్రస్తుతం రాహుల్ జమ్మూకశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో సేదతీరుతున్నారు.

ఇక ఈ నెలలో తన బ్రిటన్ పర్యటనకు సంధించిన విశేషాలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. లండన్ లోని ప్రపంచ ప్రఖ్యాత కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్న రాహుల్ అక్కడి బిజినెస్ స్కూల్లో ప్రసంగించనున్నారు. వివిధ రంగాలకు చెందిన మేధావులను కలవనుండడం సంతోషం కలిగిస్తోందని ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు. భౌగోళిక రాజకీయాలు, అంతర్జాతీయ సంబంధాలు, బిగ్ డేటా, ప్రజాస్వామ్యం తదితర రంగాలకు చెందిన వారిని కలవబోతున్నానని తెలిపారు. నా పాత విద్యాసంస్థను మళ్లీ సందర్శించేందుకు ఎదురుచూస్తున్నాను అని వెల్లడించారు.