జూన్ 4న వైసీపీ పెద్దకర్మ.. అందరూ పాలుపంచుకోవాలని RRR పిలుపు

నరసాపురం ఎంపీ, ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు (RRR) పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ పతనం నిన్ననే ప్రారంభమైనప్పటికీ తన పుట్టిన రోజు నాడే అంతమైనందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తన జననం రోజే వైసీపీ మరణించిందని, జూన్ 4న జరగనున్న పెద్దకర్మలో అందరూ పాల్గొందామని పిలుపునిచ్చారు. రాజకీయ చిత్రపటంలో యువజన శ్రామిక రైతు పార్టీ (వైసీపీ) ఇక ఉండే అవకాశం లేదని జోస్యం తెలిపారు. ఈ రోజు సాక్షి దినపత్రిలో వైసీపీ 112 స్థానాలు గెలుస్తుందని రాశారని, ‘వైనాట్ 175’ నుంచి 112కి దిగివచ్చారని ఎద్దేవా చేశారు.

ఇక ఎన్నికల విధుల్లో ఉన్న దాదాపు 4.5 లక్షల మంది ఓటు వేశారని, ఇంతమంది ఓటువేయడం చరిత్రలోనే ఇదే మొదటిసారి అని రఘురామ రాజు పేర్కొన్నారు. వీరిలో ఒకరిద్దరు తప్ప దాదాపు అందరూ కూటమికే ఓటు వేశారని చెప్పుకొచ్చారు. ఈసారి హైదరాబాద్ నుంచి సంక్రాంతికి మించి సొంతూళ్లకు తరలివచ్చి ఓటేశారని, ఓ రాక్షసుడిని వదిలించుకోవాలన్న కసితో పొరుగు రాష్ట్రాలు, విదేశాల నుంచి దాదాపు 20 లక్షల మంది తరలి వచ్చారని, వారిలో ఒక పదిశాతం మినహా మిగతా అందరూ కూటమికే ఓటువేశారని వివరించారు.