సనాతాన ధర్మాన్ని దోమల నిర్మూలన చర్యతో పోల్చడం హేయమైన చర్యః పురందేశ్వరి

విపక్షాల కూటమికి ‘ఇండియా’పేరు పెట్టుకునే నైతిక అర్హత లేదని విమర్శ

purandeswari-condemns-udhayanidhi-stalin-comment-on-sanatana-dharma

న్యూఢిల్లీః సన్నాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయ్‌ నిధి చేసిన వ్యాఖ్యలపై ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతాన ధర్మాన్ని దోమల నిర్మూలన చర్యతో పోల్చడం హేయమైన చర్య అని రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యనించారు. హిందువుల మనోభావాలను దెబ్బదీసే విధంగా ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలోని నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయినిధిని సమర్ధిస్తూ కార్తి చిదంబరం చేసిన వ్యాఖ్యలనూ పురందేశ్వరి ఖండిచారు.

‘భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రి ఉదయ్‌స్టాలిన్, సనాతాన ధర్మాన్ని దోమల నిర్మూలన చర్యతో పోల్చి నిర్మూలించాలని తన ఆకాంక్షను వ్యక్తం చేయడం హేయమైన చర్య. ఇది రాజ్యాంగ విరుద్ధం. అదే వేదికపై ఉన్న తమిళనాడులోని హిందూ మతపరమైన, ధర్మాదాయ సంస్థలకు బాధ్యత వహించే పీకే శేఖర్‌బాబు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా మౌనంగా ఉండిపోవడం దేనికి సంకేతం? సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడమే ‘ఇండియా’ కూటమి ఉద్దేశమని కాంగ్రెస్ తమిళనాడు అధ్యక్షుడు పేర్కొన్నారు. ఈ చర్యలు దేశంలోని హిందూ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి’ అని ఎక్స్ లో పోస్ట్ చేశారు. విపక్ష కూటమికి ఇండియా అని పేరు పెట్టుకోవడానికి కనీస నైతిక హక్కు లేదన్నారు. 2010 సంవత్సరంలో హిందూ సంస్ధలను లష్కరే తొయిబా సంస్ధతో రాహుల్ గాంధీ పోల్చిన విషయాన్ని పురందేశ్వరి గుర్తు చేశారు. ఇది చాలా దారుణమని చెప్పారు.