సంక్రాంతి బరి నుండి ప్రాజెక్ట్ కే తప్పుకున్నట్లేనా..?

సంక్రాంతి బరి నుండి ప్రాజెక్ట్ కే తప్పుకున్నట్లేనా..? ప్రస్తుతం ఫిలిం సర్కిల్లో ఇదే చర్చ నడుస్తుంది. బాహుబలి మూవీ తో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సాధించిన ప్రభాస్..ఆ తర్వాత సాహో, రాధే శ్యామ్ వంటి వరుస పాన్ మూవీస్ చేసి మరింత ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఒకటి , రెండు కాదు ఏకంగా నాల్గు పాన్ మూవీస్ ను లైన్ లో పెట్టాడు. వాటిలో ఆదిపురుష్ మూవీ ఈ నెల 16 న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. ఇక కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రాజెక్ట్ కె, మారుతీ డైరెక్షన్లో రాజా డీలక్స్ మూవీస్ చేస్తున్నాడు. ఈ మూడు కూడా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్నాయి. వీటిలో నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేస్తున్న ప్రాజెక్ట్ కె చాల ప్రత్యేకం. ఈ మూవీ ఎవెంజర్స్ తరహాలో ఉండబోతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మూవీ లో ప్రభాస్ కనిపించబోతున్నాడు. అలాగే బాలీవుడ్ స్టార్ నటి నటులు ఈ మూవీ లో యాక్ట్ చేస్తున్నారు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ ని నిర్మాత అశ్విని దత్ నిర్మిస్తున్నారు.

ముందు నుండి మేకర్స్‌ ఈ సినిమాను ఇంటర్నేషనల్‌ లెవల్లో రూపొందిస్తున్నట్లు చెబుతూనే వస్తున్నారు. దానికి తగ్గట్లే ఈ సినిమా కోసం కొత్తగా కార్లు వంటివి తయారు చేస్తున్నారు. ఇక ఇటీవలే రీఇన్వెంటింగ్‌ ది వీల్‌ అంటూ ఓ వీడియోను రిలీజ్‌ చేశారు. ఒక్క టైరు కోసం చిత్రయూనిట్‌ ఎంత కష్టపడిందో ఆ వీడియోలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆ వీల్‌ సహాయంతోనే ప్రభాస్‌ టైమ్‌ ట్రావెల్ చేయబోతున్నట్లు సమాచారం. ప్రభాస్ కూడా ఈ సినిమా కోసం బాగానే కష్టపడుతున్నాడని ఇన్ సైడ్ టాక్.

ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించేసింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్ ను కూడా వదిలింది. అయితే ఇప్పుడు ఈ సినిమా చెప్పిన సమయానికి రాకపోవచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న రవితేజ ఈగల్ సినిమా పోస్టర్ రిలీజైంది. అందులో సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు పెద్ద పెద్ద అక్షరాలను పొందుపర్చారు. కాగా ఆ సినిమాను పీపుల్ మీడియా బ్యానర్ నిర్మిస్తుంది. ఇక పీపుల్ మీడియా ప్రభాస్ కు చాలా క్లోజ్. ఇప్పటికే ప్రభాస్, మారుతి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాను నిర్మిస్తుంది. ఏ ప్రొడ్యూసర్ సహసం చేయలేని విధంగా ఆదిపురుష్ హక్కులను కోట్లు పెట్టి కొనుక్కుంది. అంతేకాకుండా ప్రభాస్ నెక్స్ట్ సినిమా స్పిరిట్ కు సహ-నిర్మాతగా కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇలా మూడు సినిమాలను టేకోవర్ చేసి ప్రభాస్ కు చాలా దగ్గరయ్యారు. దాంతో ప్రాజెక్ట్ కే సంక్రాంతికి రాద‌నే స‌మాచారంతోనే పీపుల్ మీడియా వాళ్లు ఈగ‌ల్‌ను పండ‌క్కి షెడ్యూల్ చేసిన‌ట్లున్నారు. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.