నారా లోకేష్ ను మంగళగిరిలో ఓడించి తీరుతాం – విజయసాయిరెడ్డి

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం పెరిగిపోతుంది. గత ఎన్నికల్లో ఘోర ఓటమిచవిచూసిన టిడిపి..ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని కసిగా ఉంది. ఇప్పటికే జనసేన తో పొత్తు పెట్టుకొని అభ్యర్థుల ఎంపిక లో కసరత్తుల్లో బిజీ గా ఉంది. బిజెపి సైతం టిడిపి తో జత కలిసేందుకు సిద్ధంగా ఉండడం తో..అధికార పార్టీ నేతలు మరింత దూకుడు పెంచుతున్నారు.

ఇదిలా ఉంటె వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా మాట్లాడుతూ.. మంగళగిరిలో టీడీపీ నేత నారా లోకేశ్ ను ఓడించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ‘మరో వారంలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై స్పష్టత వస్తుంది. స్థానికులకే టికెట్ కేటాయిస్తాం. స్థానికంగా ఉండే అభ్యర్థి కావాలో.. హైదరాబాద్ నుంచి పరిపాలన చేసే వారు కావాలో ప్రజలే తేల్చుకోవాలి. ఎన్నికల తర్వాత బాబు, లోకేశ్ హైదరాబాద్ పారిపోతారు’ అని ఆయన విమర్శించారు. ప్రస్తుతం వైసీపీ మంగళగిరి అభ్యర్థి బరిలో గంజి చిరంజీవి , కమల ఉన్నారు. వీరిలో ఎవరికీ టికెట్ ఇస్తుందో చూడాలి.