ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప బహుమతుల్లో యోగా ఒకటిః రాష్ట్రపతి
న్యూఢిల్లీః ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన యోగా వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి దేశ ప్రజలకు యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యోగా అనేది మన నాగరికత సాధించిన గొప్ప విజయాల్లో ఒకటని చెప్పారు. ఈ ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప బహుమతుల్లో యోగా ఒకటని కొనియాడారు. ఇది మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.
కాగా, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగా వేడుకల్లో పాల్గొన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆధ్వర్యంలో సూరత్ లో నిర్వహించిన యోగా వేడుకల్లో లక్ష మంది పాల్గొని యోగాసనాలు వేశారు. యోగా దినోత్సవం సందర్భంగా భారత ఆర్మీ, వివిధ బెటాలియన్ల సైనికులు వేసిన యోగాసనాలు ఆకట్టుకుంటున్నాయి.