జూలై 2న కాంగ్రెస్‌లో చేరనున్న జూపల్లి, పొంగులేటి !

వారితోపాటు మరికొందరు నేతలు కూడా చేరిక

Jupalli and Ponguleti will join the Congress on July 2!

హైదరాబాద్‌ః మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం కుదిరింది. వచ్చే నెల రెండో తేదీన ఖమ్మంలో జరగనున్న బహిరంగ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో హస్తం పార్టీలో చేరనున్నారు. ఈ నెల 25న ఢిల్లీ వెళ్లనున్న ఈ ఇద్దరు నేతలు రాహుల్‌‌తో సమావేశమవుతారు. తర్వాతి రోజు అక్కడే విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ప్రకటిస్తారు. ఈ మేరకు ప్రణాళిక ఖరారైనట్టు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి నేడు పొంగులేటి నివాసానికి వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తారు. ఆ తర్వాత జూపల్లిని కూడా కలుస్తారు.

పొంగులేటి, జూపల్లితో బిజెపి నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో చేరడమే మంచిదనే అభిప్రాయానికి వారు వచ్చినట్టు తెలిసింది. దీనికి తోడు రాష్ట్రం నుంచి బిజెపిలో చేరిన నేతలకు ప్రాధాన్యం లభించకపోవడంతో అంతిమంగా వారు కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరితోపాటు ఇద్దరు ఎమ్మెల్సీలు, కొందరు మాజీ ఎమ్మెల్యేలు, ముగ్గురు జడ్పీ చైర్మన్లు కూడా చేరే అవకాశం ఉందని కూడా సమాచారం.