గాంధీ భవన్ వద్ద పొన్నాల లక్ష్మయ్య హల్చల్

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నిక పోలింగ్‌ దేశ కొనసాగుతుంది. రాష్ట్రంలోని 238 ప్రతినిధులు తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. అయితే పోలింగ్‌ జగురుతున్నవేళ గాంధీభవన్‌ వద్ద మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య హల్చల్ చేసారు. జనగామ జిల్లాకు చెందిన శ్రీనివాస్‌ రెడ్డిని ఓటు వేయకుండా పీఆర్వో అడ్డుకోవడంపై పొన్నాల ఆగ్రహం వ్యక్తం చేశారు. 45 ఏళ్లుగా కాంగ్రెస్‌ లో ఉన్న వ్యక్తికి అవమానం జరిగిందని ఫైర్ అయ్యారు. ఓటరు లిస్టు నుంచి శ్రీనివాస్‌ రెడ్డి పేరును చివరి క్షణంలో ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. పీఆర్వోతో వాగ్వాదానికి దిగిన పొన్నాలను సీనియర్‌ నేత జానారెడ్డి సముదాయించి అక్కడినుంచి తీసుకెళ్లారు.

అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రతి నియోజకవర్గంనుంచి ఇద్దరికి అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా జనగామ నుంచి పొన్నాల లక్ష్మయ్య, చెంచారపు శ్రీనివాస్‌ రెడ్డికి ఏఐసీసీ ఓటింగ్‌ కార్డు జారీ చేసింది. గత రాత్రి శ్రీనివాస్‌ రెడ్డి స్థానంలో కొమ్మూరు ప్రతాప్‌ రెడ్డి పేరును రాష్ట్ర నాయకత్వం చేర్చింది. దీంతో ఓటు వేయడానికి గాంధీభవన్‌కు వచ్చిన శ్రీనివాస్‌ రెడ్డిని పీఆర్వో సిబ్బంది అడ్డుకున్నారు.

ఇక ఉదయం 10 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ సహా సీనియర్ లీడర్లు చిందబరం, జైరాం రమేశ్ తదితరులు ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్టీ అధ్యక్ష బరిలో ఉన్న మల్లికార్జున ఖర్గే కూడా ఢిల్లీలో ఓటేశారు. పోలింగ్ ఏర్పాట్లలో భాగంగా ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాల్లోని పార్టీ కార్యాలయాల్లో 67 కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 22 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి.