జనజాతర సభ ఫై కేటీఆర్ సెటైర్లు

అది జనజాతర కాదు.. అబద్ధాల జాతర అంటూ కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ..శనివారం హైదరాబాద్ లోని తుక్కుగూడ లో ‘జనజాతర’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభ కు ముఖ్య అతిధిగా రాహుల్ గాంధీ హాజరై, కాంగ్రెస్ మేనిఫెస్టో ను రిలీజ్ చేసారు. ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుండి లక్షల్లో కాంగ్రెస్ శ్రేణులు హాజరై , సభ ను సక్సెస్ చేసారు. ఈ సభ వేదిక ఫై రాహుల్ గాంధీ బిజెపి ఫై నిప్పులు చెరుగుతూ..కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు అందించే హామీలను తెలియజేసారు.

ఈ హామీలపై కేటీఆర్ స్పందించారు. అది జనజాతర సభ కాదు…
హామీల పాతర… అబద్ధాల జాతర సభ..

రాహుల్ గాంధీ గారు…
అసెంబ్లీ ఎన్నికల సమయంలో..
6 గ్యారెంటీల పేరిట గారడి చేశారు..!

పార్లమెంట్ ఎలక్షన్లలో..
న్యాయ్ పేరిట నయా నాటకానికి తెరతీశారా..?

తెలంగాణకు తీరని అన్యాయం చేసి..
ఇప్పుడొచ్చి న్యాయ్ అంటే నమ్మేదెవరు ??

నమ్మి ఓటేసిన నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలను
నాలుగు నెలలుగా నయవంచన చేస్తోంది కాంగ్రెస్

అసత్యాలతో అధికారంలోకి వచ్చి..
అన్నదాతలను ఆత్మహత్యల పాల్జేస్తోంది..
నేతన్నల బలవన్మరణాలకు కారణమవుతోంది..
గ్యారెంటీలకు పాతరేసి… అసత్యాలతో జాతర చేస్తోంది..

తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంగా..
ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు..
అధికారంలోకి వచ్చాక నరకం చూపిస్తున్నారు..

కాంగ్రెస్ అసమర్థ పాలనలో…
సాగునీరు లేక అన్నదాతలు పంట నష్టపోతున్నారు.
రుణమాఫీ లేక రైతులు అప్పుల పాలవుతున్నారు.
తాగునీటికి తెలంగాణ ప్రజలు తండ్లాడుతున్నారు.
మీ మోసాలపై మహిళలు మండిపడుతున్నారు..

రాహుల్ గారు..
మా అన్నదాతల ఆర్థనాదాలు వినిపించడం లేదా..?
లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినా స్పందించరా ?
200కిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నా ఆదుకోరా ?
చేనేతరంగం సంక్షోభంలో కూరుకుపోయినా కనికరించరా ?
డిసెంబర్ 9న చేస్తానన్న రుణమాఫీపై సర్కారును నిలదీయరా ?

75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో..
దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు..
ఇంకా వెనకబడి ఉన్నారంటే కారణమే.. కాంగ్రెస్
కులగణన పేరిట మీ కొత్త పల్లవికి ఓట్లు రాలవు

చేతి గుర్తుకు ఓటేస్తే..
చేతులెత్తేయడం ఖాయమని..
తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది.

సకల రంగాలను సంక్షోభంలోకి నెట్టిన..
భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టుకుంటే..
నిండా మునగడం ఖాయమని తేలిపోయింది.

అందుకే..
వందరోజుల్లోనే హామీలను బొందపెట్టిన కాంగ్రెస్ కు
వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజల చేతిలో గుణపాఠం ఖాయం.

జై తెలంగాణ అంటూ ఆయన ట్వీట్ చేశారు.