బీఆర్ఎస్ ప్రభుత్వం ఫై మరోసారి ధ్వజమెత్తిన పొంగులేటి

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫై విమర్శలు కురిపించారు. గత కొద్దీ రోజులుగా బిఆర్ఎస్ కు దూరంగా ఉంటున్న శ్రీనన్న..ప్రస్తుతం బిజెపి లో చేరేందుకు సిద్దమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆత్మీయ సమ్మేళనం పేరిట తన అనుశ్రేణులను కలుస్తూ సభలు నిర్వహిస్తున్నారు. నేడు మధిర నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన పొంగులేటి.. తన అనుచరులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం ఎవ్వడి అబ్బ సొమ్ము కాదని.. ప్రజా తీర్పే అంతిమ అని అన్నారు.

రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఎక్కడైనా వస్తుందా? అని ప్రశ్నించారు. రుణమాఫీ కూడా 20 శాతమే చేశారని ఆరోపించారు. దీనిపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పగలరా? అని నిలదీశారు. అధికారం ఎవరి అబ్బ సొత్తు కాదని అన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనుకడగు వేయను అని స్పష్టం చేశారు. నాడు కురుక్షేత్రంలో కౌరవులంతా ఒక పక్కన ఉన్నారని, కానీ నేడు శీనన్న వెంట లక్షలాది హృదయాల మద్దతు ఉందని, ఆ తుపానులో మీరు కొట్టుకుపోవడం తథ్యం అని వ్యాఖ్యానించారు.

ఒకప్పుడు వైస్సార్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నేను, ఖమ్మం ఎంపీగా ఉన్న నేను వారి మాటలు నమ్మి నాడు టీఆర్ఎస్ పార్టీలో చేరాను. పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడమే కాకుండా, జిల్లాలో పార్టీ అభ్యర్థుల ఓటమికి పనిచేశానంటూ నాపై నిందలు మోపారు. ఆ తర్వాత పెద్దలు కేసీఆర్, కేటీఆర్ మాట విని నాడు టీఆర్ఎస్ అభ్యర్థి కోసం గ్రామగ్రామాన తిరిగి విజయం కోసం కృషి చేశాను. కానీ నన్ను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు” అని పొంగులేటి చెప్పుకొచ్చారు. ఓ చిన్న కుటుంబం నుంచి వచ్చిన తనను జిల్లాలో ప్రతి ఒక్క కుటుంబం తమ గుండెల్లో పెట్టి చూసుకుంటోందని, అందుకే ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు.