బీహార్ పర్యటన లో సీఎం కేసీఆర్ ఫై అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు

ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ బీహార్ పర్యటన లో సీఎం కేసీఆర్ ఫై కీలక వ్యాఖ్యలు చేసారు. పర్యటన లో స్థానిక మీడియా అసదుద్దీన్ ఓవైసీ ని పలు ప్రశ్నలు వేశారు. అందులో కేసీఆర్ ప్రధాని రేసులో ఉన్నారా? అన్న ప్రశ్నకు ఓవైసీ సమాధానం ఇచ్చారు. సీఎం కేసీఆర్ గొప్ప దార్శనికుడని, ఆయన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని ప్రశంసించారు. అంతేకాక, కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, తెలంగాణ లాండ్ లాక్డ్ రాష్ట్రం అయినప్పటికీ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి చాలా బాగుందని అన్నారు.

పంపు సెట్ల వినియోగంలో ట్యాప్ ర్యాంకులో ఉందని, అంతేకాక మత్స్య సంపదలో దేశంలోనే రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా తెలంగాణ నిలిచిందంటే దానికి కారణం సీఎం కేసీఆర్ అని ఓవైసీ అన్నారు. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటె బీహార్‌లో 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎంఐఎం ఐదు సీట్లు గెలుచుకున్న విషయం విధితమే. అయితే నలుగురు ఎమ్మెల్యేలు గత సంవత్సరం ఆర్జేడీలో చేరారు. వారిలో ఒకరికి క్యాబినెట్ బెర్త్ కూడా దక్కింది.