భట్టి విక్రమార్కతో పొంగులేటి భేటి

కెసిఆర్ ను ఓడించడానికి నాలుగు మెట్లు దిగుతానని వ్యాఖ్య

ponguleti-meets-mallu-bhatti-vikramarka

హైదరాబాద్‌ః తెలంగాణలో బిఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ముందుకు సాగుతున్నాయి. మరోవైపు బిఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సర్వం సిద్ధమయింది. నిన్ననే వీరితో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చలు జరిపి లైన్ క్లియర్ చేశారు. ఈ క్రమంలో పాదయాత్ర చేస్తున్న మల్లు భట్టివిక్రమార్కను పొంగులేటి కలిశారు. రాష్ట్ర రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీలో పరిణామాలపై చర్చించారు.

ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ… తాను కాంగ్రెస్ చేరే విషయంలో పెద్దలంతా కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. సిఎం కెసిఆర్‌ ను ఇంటికి పంపించేందుకు నాలుగు మెట్లు దిగతామని అన్నారు. మాయ మాటలు చెప్పి కెసిఆర్‌ అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు. కెసిఆర్ పాలనకు చరమగీతం పలకాల్సిన అవసరం ఉందని చెప్పారు. అమరవీరుల కుటుంబాలను కెసిఆర్ ఆదుకోలేదని విమర్శించారు. ఇచ్చిన హామీలను, వ్యవస్థలను, హామీలను గాలికొదిలేశారని అన్నారు.