వీధి కుక్కల దాడిలో మరో బాలుడు మృతి

హైదరాబాద్ అంబర్ పేట్ లో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన గురించి ఇంకా మాట్లాడుకుంటుండగానే మరో ఘటన చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో మరో బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల పరిధిలోని పుటానితండా గ్రామ పంచాయతీలో జరిగింది.

పుటానితండా కు చెందిన బానోతు భరత్ (5) ఆదివారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి ఇంటి దగ్గర ఆడుకుంటున్నాడు. ఈ సమయంలో వీధిలో ఉన్న కుక్కలు బాలుడిపై ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన అనంతరం స్థానికులు.. హుటాహుటిన ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో తల్లిదండ్రులు బాలుడిని హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటన తో ఆ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కుక్కల దాడులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కుక్కల దాడులను నియంత్రించేందుకు చర్యలు చేపట్టినప్పటికీ.. ఫలితం లేకుండా పోతోంది.