నారా లోకేశ్ కు పోలిసులు నోటీసులు జారీ

గన్నవరం సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ నోటీసులు

police-notices-to-nara-lokesh

అమరావతిః గన్నవరం సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ టిడిపి యువనేత నారా లోకేశ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన పోలీసులకు నారా లోకేశ్ ను కలవడం వీలు కాలేదు. లోకేశ్ ను కలవాలని పోలీసులు చెప్పినప్పటికీ కుదరలేదు. దీంతో, అక్కడ ఉన్న మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణకు నోటీసులు అందించి వెళ్లిపోయారు.

ఇంకోవైపు లోకేశ్, పలువురు టిడిపి నేతలపై పోలీసులకు గుడివాడ వైఎస్‌ఆర్‌సిపి నేతలు ఫిర్యాదు చేశారు. కొడాలి నాని, వల్లభనేని వంశీలను చంపేస్తాననే విధంగా లోకేశ్ వ్యాఖ్యానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లోకేశ్, బుద్దా వెంకన్న, కొల్లు రవీంద్ర, యార్లగడ్డ వెంకట్రావు, అయ్యన్నపాత్రుడులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. టిడిపిలోని సైకోలను పక్కన పెట్టుకుని సభలో లోకేశ్ చెలరేగి పోయారని అన్నారు.