తెలంగాణలో మళ్లీ మొదలైన మావోయిస్టుల కదలికలు
తెలంగాణ లో మావోయిస్టుల కదలికలు మళ్లీ మొదలవ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ అటవీ ప్రాంతంలో పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా డంప్ బయటపడింది. మహారాష్ట్ర సరిహద్దు కైలాష్ టెక్ది ప్రాంతంలో గుర్తించారు పోలీసులు. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. అడెళ్లు దళం సంచారం నేపథ్యంలో మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు ప్రభాత్, భాస్కర్, వర్గీస్, రాము, అనిత సంచరిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. బోథ్ మండలంలోని కైలాస్ టేకిడి ప్రాంతంలో పోలీసు బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ఈ కూంబింగ్లో మావోలకు సంబంధించిన గ్రెనేడ్ లభ్యమైంది. అయితే దీనిని పోలీసులు ధ్రువీకరించడం లేదు. గోప్యంగా ఉంచుతున్నారు. కానీ మావోల కోసం భారీగా బలగాలతో కూంబింగ్ కొనసాగిస్తున్నారు. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు ప్రాబల్యం తగ్గిందనుకున్న తరుణంలో.. కొద్ది రోజులుగా అడవుల్లో సంచరిస్తూ అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. మావోయిస్టులు ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. మావోయిస్టులు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం.. దాడులు చేసే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ అధికారుల హెచ్చరికలతో.. జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు.