జంతర్మంతర్ వద్ద ఇండియా కూటమి నేతలు ధర్నా
ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు ఎంతకైనా పోరాడుతాం.. శరద్ పవార్
న్యూఢిల్లీ: ఈరోజు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఇండియా కూటమి నేతలు సేవ్ డెమోక్రసీ ప్రదర్శన చేపట్టారు. విపక్ష పార్టీలకు చెందిన నేతలు ఆ ధర్నాలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు ఎంతకైనా పోరాడుతామని ఆయన అన్నారు. ఇటీవల పార్లమెంట్ ఉభయసభల్లో వందకుపైగా ఎంపీలను ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆ సస్పెన్షన్లను వ్యతిరేకిస్తూ విపక్షాలు నేడు జంతర్ మంతర్లో ఆందోళన చేపట్టారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఇద్దరు ముగ్గురు యువకులు పార్లమెంట్లోకి ప్రవేశించి స్మోక్ వదిలారని, ఈ ఘటన పట్ల బిజెపి సమాధానం ఇవ్వడంలేదని, పరారీ అయ్యిందని అన్నారు. సెక్యూర్టీ ఉల్లంఘన ఎందుకు జరిగిందన్న ప్రశ్న వస్తుందని, అంతేకాదు అసలు ఆ యువత ఎందుకు ఈ విధంగా నిరసన వ్యక్తం చేశారన్న ప్రశ్న కూడా తలెత్తుతుందని రాహుల్ అన్నారు. దీనికి కారణం దేశంలో నిరుద్యోగమే అని రాహుల్ ఆరోపించారు.