నీతి ఆయోగ్ కంటే కెసిఆర్‌కు ముఖ్యమైన పనేంటి?: కిషన్​ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా డబ్బులు పంచేందుకే జీవో 111ను రద్దు చేశారని విమర్శ

kcr-job-is-to-insult-modi-and-the-centre-says-kishan-reddy

న్యూఢిల్లీః కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, సిఎం కెసిఆర్ పై మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ రోజు ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి కెసిఆర్ హాజరుకాకపోవడంపై విమర్శలు చేశారు. దీనికంటే ముఖ్యమైన పనేముందని కెసిఆర్ ను ప్రశ్నించారు. ఈ రోజు హైదరాబాద్ లోని బిజెపి కేంద్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రాన్ని, ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించడమే కెసిఆర్ పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. అన్ని రాష్ట్రాలను కలుపుకొని మోడీ ముందుకెళ్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. కానీ, కెసిఆర్ నీతి ఆయోగ్ కు వెళ్లకపోవడం దురదృష్టకరమన్నారు.

రాష్ట్రాన్ని కెసిఆర్ అప్పుల కుప్పగా మార్చారని, ఆదాయానికి మించి అప్పులు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో భూములు అమ్మితేగానీ ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. అయినా తెలంగాణలో పేదరికమే లేనట్లుగా కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 3.50 లక్షల కోట్ల అప్పు ఉందని.. బడ్జెటేతర అప్పులు కలుపుకుంటే మొత్తం 6 లక్షల కోట్ల అప్పు ఉందని తెలిపారు. తెలంగాణకు కేంద్రం సాయంపై చర్చకు సిద్ధమని కేసీఆర్‌కు కిషన్ రెడ్డి సవాలు విసిరారు. దళిత ముఖ్యమంత్రి, దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్రూం ఇళ్లు హామీలు సహా కొన్ని వందల సార్లు కెసిఆర్ మాట తప్పారని విమర్శించారు. మాట తప్పితే తల నరుక్కుంటాననే కెసిఆర్.. కొన్ని వేల సార్లు తల నరుక్కోవాల్సి వచ్చేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కంపెనీగా మారిందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా డబ్బులు పంచడం కోసమే 111 జీవో రద్దు చేశారని ఆరోపించారు. బిఆర్ఎస్ నేతలకు 111 జోవో పరిధిలో వందలాది ఎకరాలున్నాయన్నారు.