రేపు 9 వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోడీ
కొత్త రైళ్లకు వర్చువల్ గా పచ్చజెండా ఊపనున్న ప్రధాని మోడీ
న్యూఢిల్లీః దేశంలో వందేభారత్ రైళ్ల సంఖ్య మరింత పెరగనుంది. రేపు (ఆదివారం) ప్రధాని నరేంద్ర మోడీ ఏకంగా 9 వందేభారత్ రైళ్లకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ కొత్త వందేభారత్ రైళ్ల ద్వారా తెలంగాణ, ఏపీ, రాజస్థాన్, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, కేరళ, గుజరాత్, ఒడిశా, బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల ప్రయాణికులకు లబ్ది చేకూరనుంది.
ఈ 9 వందేభారత్ ఎక్స్ ప్రెస్ లకు ప్రధాని మోడీ వర్చువల్ గా పచ్చజెండా ఊపి ప్రారంభోత్సవం చేయనున్నారు. దేశంలో అత్యంత వేగంగా వెళ్లే రైళ్లుగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ లు పేరుగాంచాయి. సాధారణ రైళ్లతో పోల్చితే వీటిలో ప్రయాణిస్తే సగటున రెండున్నర గంటల సమయం ఆదా అవుతుంది. రేపు ప్రారంభోత్సవం జరుపుకునే కొత్త వందేభారత్ రైళ్లలో హైదరాబాద్-బెంగళూరు, విజయవాడ-చెన్నై సర్వీసులు కూడా ఉన్నాయి. విజయవాడ-చెన్నై వందేభారత్ రైలును తిరుపతికి తరలివచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని రేణిగుంట మీదుగా నడపనున్నారు.