నేడు తెలంగాణకు రానున్న ప్రధాని మోడీ
మూడు రోజుల పాటు తెలంగాణలో ప్రచారం చేయనున్న ప్రధాని మోడీ
![](https://www.vaartha.com/wp-content/uploads/2023/11/PM-Modi-to-Campaign-in-Telangana-for-Three-Days-jpg.webp)
హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోడీ నేడు రానున్నారు. మూడు రోజులపాటు రాష్ట్రంలో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. నేడు కామారెడ్డి, మహేశ్వరంలో ప్రధాని ప్రచారం చేపట్టనున్నారు. 26వ తేదీన దుబ్బాక, నిర్మల్ బహిరంగసభల్లో పాల్గొంటారు. ఈనెల 27న మహబూబాబాద్, కరీంనగర్లో నిర్వహించే బహిరంగసభలతో పాటు హైదరాబాద్ లో నిర్వహించనున్న రోడ్డు షో పాల్గొననున్నారు.
ఎన్నికల పర్యటనలో భాగంగా ప్రధాని రాజ్ భవన్లో బస చేయనున్నారు. అదే విధంగా కేంద్ర హోంశాఖ మంత్రి కొల్లాపూర్, మునుగోడు, పటాన్ చెరు ప్రచార సభల్లో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం ఖైరతాబాద్ నియోజకవర్గంలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొన్ని అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి తరపున ప్రచారం చేయనున్నారు.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉదయం 11 గంటలకు సిర్పూర్ కాగజ్ నగర్, మధ్యాహ్నం 1 గంటలకు వేములవాడలో నిర్వహించే సభలో ఆయన పాల్గొంటారు.
మధ్యాహ్నం 2:30 గంటలకు సనత్ నగర్ నియోజకవర్గంలో నిర్వహించే ప్రచార సభకు హాజరవుతారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు గోషామహల్లో నిర్వహించే స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు.ఆకాశ్ పురి హనుమాన్ ఆలయం నుంచి పురానాపూల్ గాంధీ విగ్రహం వరకు నిర్వహించే స్ట్రీట్ కార్నర్ సభకు హాజరవుతారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హుజూర్ నగర్లో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు. అనంతరం సికింద్రాబాద్, ముషీరాబాద్లో నిర్వహించే రోడ్ షోల్లో పాల్గొంటారు. ఉప్పల్లో ప్రచారానికి ఎంపీ మనోజ్ తివారి రానున్నారు.