అంధవిశ్వాసాలను నమ్మి సచివాలయాన్ని కూల్చారుః ప్రధాని మోడీ
ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? అని ప్రశ్న
మహబూబాబాద్: సచివాలయం కూల్చివేతపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ మహబూబాబాద్లో నిర్వహించిన బిజెపి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్కు అంధవిశ్వాసాలు ఎక్కువ అని దుయ్యబట్టారు. మూఢ విశ్వాసాలతో ప్రజాధనం వృథా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంధవిశ్వాసాలను నమ్మి సచివాలయాన్ని కూల్చార. అలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? అని ప్రశ్నించారు. తెలంగాణలో తొలిసారి బజెపి అధికారంలోకి రాబోతుందన్నారు. అవినీతి చేసిన వారిని వదిలేది లేదని, బిఆర్ఎస్లోని అవినీతిపరులను తప్పకుండా జైలుకు పంపిస్తామన్నారు. మోడీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తయ్యే గ్యారంటీ… అని ప్రధాని తెలుగులో చెప్పారు.
“బిఆర్ఎస్ అవినీతిపరులను జైలుకు పంపిస్తామని సంకల్పం తీసుకున్నాం. సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపేది తెలంగాణ బిజెపి సర్కార్. రెండుపడక గదులు ఇళ్లు ఇస్తామని చెప్పి మోసం చేసిన వారిని జైలుకు పంపేది తెలంగాణ బిజెపి సర్కార్. తెలంగాణను కాంగ్రెస్, బిఆర్ఎస్ మాత్రమే నాశనం చేశాయి. బిజెపి మంత్రివర్గంలో అన్ని వర్గాలకు సముచితస్థానం ఉంటుంది. గతంలో కెసిఆర్ ఢిల్లీకి వచ్చి బిజెపితో కలుస్తామని అడిగారు. తన వారసుడిని సీఎంగా చేస్తే.. బిజెపితో కలుస్తామని కెసిఆర్ అడిగారు. కెసిఆర్ విజ్ఞప్తిని తిరస్కరించడంతో బిజెపిని తిట్టడం మొదలుపెట్టారు.” అని మోడీ తెలిపారు.