ఇజ్రాయెల్‌ పర్యటనకు వెళ్లనున్న బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌..!

rishi-sunak
rishi-sunak

లండన్: బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ ఇజ్రాయెల్‌ లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే ఆయన ఇజ్రాయెల్‌ పర్యటనకు వెళ్లనున్నట్లు స్కై న్యూస్‌ కథనం వెల్లడించింది. అయితే ఈ విషయాన్ని అధికారిక వర్గాలు ధృవీకరించలేదు. కాగా, గత వారం ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించేందుకు బ్రిటన్‌ విదేశాంగ మంత్రి జేమ్స్‌ క్లెవర్లీ ఆ దేశంలో పర్యటించిన విషయం తెలిసిందే.

హమాస్‌ మిలిటెంట్లతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌లో ఇవాళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పర్యటించనున్నారు. బుధవారం అధ్యక్షుడు జో బైడెన్‌ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లనున్నారని అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం ప్రకటించింది. హమాస్‌ తీవ్రవాద దాడిని ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌కు తన బలమైన మద్దతును ప్రదర్శించడమే ఆ దేశంలో బైడెన్ పర్యటన ప్రధాన ఉద్దేశమని వైట్‌హౌస్‌ తన ప్రకటనలో పేర్కొంది. యుద్ధం నేపథ్యంలో తర్వాత చేపట్టాల్సిన చర్యలపైనా ఇజ్రాయెల్‌తో చర్చించనున్నట్లు వెల్లడించింది.

మరోవైపు ఈ యుద్ధంతో రెండు దేశాల్లో మరణాల సంఖ్యం అంతకంతకూ పెరుగుతోంది. హమాస్‌ దాడుల్లో ఇజ్రాయెల్‌ వైపు 1,300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇజ్రాయెల్‌ దాడులతో గాజాలో మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ అక్కడ 3000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. సుమారు 10 లక్షల మందికిపైగా ప్రజలు గాజాను వీడారు.