భారత్ లో మరో రెండు టీకాలకు కేంద్రం ఆమోదం

జాబితాలో కొవోవ్యాక్స్, కార్బెవ్యాక్స్

న్యూఢిల్లీ: కరోనా ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన కలిగిస్తున్న తరుణంలో.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నిపుణుల కమిటీ అత్యవసరంగా రెండు కొత్త టీకాలు, ఒక కొత్త ఔషధానికి అనుమతులకు సిఫారసు చేసింది. టీకాలు రెండూ వ్యాధి నుంచి ముందస్తు రక్షణ ఇచ్చేవి. ఇక నోటి ద్వారా తీసుకునే మోల్నుపిరావిర్ ఔషధం మాత్రం.. కరోనా చికిత్సలో మంచి ఫలితాలను ఇస్తున్నట్టు ఇప్పటికే పరిశోధనల్లో వెల్లడైంది. సిరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా దరఖాస్తు చేసుకున్న కొవోవ్యాక్స్ కూడా కీలకమైనదే. పరిశోధనల్లో ఈ వ్యాక్సిన్ సమర్థతపై సానుకూల ఫలితాలున్నాయి.

12 ఏళ్లకు పైబడిన వారికి ఇప్పటివరకు క్యాడిలాకు చెందిన జైకోవ్ డీ వ్యాక్సిన్ కే అనుమతి ఉండగా, భారత్ బయోటెక్ కు చెందిన కొవాగ్జిన్ కు అత్యవసర అనుమతి లభించింది. ఇప్పుడు కోవోవ్యాక్స్, బయోలాజికల్ ఈకి చెందిన కార్బేవ్యాక్స్ కు అనుమతి ఇవ్వాలంటూ కేంద్ర ఔషధ నియంత్రణ మండలి పరిధిలోని నిపుణుల కమిటీ (ఎస్ఈసీ) భారత ఔషధ నియంత్రణ మండలికి సూచించింది. దీనిపై ఔషధ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకోనుంది.

ఇందులో కోవోవ్యాక్స్ కు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం కూడా ఉంది. ఫిలిప్పీన్స్ లోనూ దీనికి సిరమ్ ఇనిస్టిట్యూట్ అనుమతి తీసుకుంది. ఇండోనేషియాకు 2 కోట్ల డోసులను ఎగుమతి కూడా చేసింది. మోల్నుపిరావిర్ ఔషధాన్ని కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వారికి 5 రోజుల డోసేజ్ గా ఇవ్వాలని నిపుణులు సూచించినట్లు తెలుస్తోంది. ఆక్సిజన్ స్థాయులు 93 కు పైన ఉన్న వారికే ఈ ఔషధాన్ని సిఫారసు చేయనున్నారు. ఆరంభంలో ఇవ్వడం వల్ల వైరస్ విస్తరణను బలంగా అడ్డుకుంటున్నట్టు పరిశోధనల్లో గుర్తించారు. దేశీయంగా 8 ఫార్మా కంపెనీలు ఈ ఔషధాన్ని తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/