రామ మందిరం ‘ప్రాణ ప్రతిష్ఠ’..ఉపవాస దీక్ష విరమించిన ప్రధాని మోడీ
అయోధ్య : అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ క్రతువు ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ తన ఉపవాస దీక్షను విరమించారు. ఈ సందర్భంగా ఓ సాధువు మోడీకి తీర్థం అందించి దీక్ష విరమింపజేశారు. అనంతరం ఆయన ఆశీర్వాదాన్ని మోడీ తీసుకున్నారు. రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట వేడుకకు ముందు మోడీ 11 రోజుల క్రితం అనుష్ఠాన దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈనెల 12వ తేదీన దీక్ష ప్రారంభం కాగా నేటి వరకు కొనసాగింది. ఇక అప్పటి నుంచి దీక్షలో భాగంగా మోడీ కఠిన నియమాలు, మతపరమైన వ్యాయామాన్ని పాటించారు. మోడీ ఈ 11 రోజులూ నేలపైనే నిద్రించారు. కేవలం కొబ్బరినీళ్లను మాత్రమే సేవించి కఠోర దీక్ష కొనసాగించారు.