కేసీఆర్ కు కిషన్ రెడ్డి సవాల్..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బిజెపి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రానికి అనేక నిధులు ఇచ్చిందని ఆ లెక్కలపై సీఎం కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలని.. తాను చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర వరంగల్ లో ముగిసింది. ఈ సందర్భంగా హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రానికి ఎప్పటికప్పుడు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోందన్నారు. కానీ.. కేంద్రంపై విష ప్రచారం చేస్తోందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చిన వేల కోట్ల రూపాయలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు.

వరంగల్ జిల్లాకు ఎన్ని నిధులు కేటాయించిందో చెప్పాలని సవాల్ విసిరారు. వీరభద్ర రామప్ప ఆలయానికి యునోస్కో గుర్తింపు తెచ్చిన ఘనత కేంద్రానికి దక్కుతుందన్నారు. ఈ ఆలయానికి రూ. 60 వేల కోట్లు ఖర్చు పెట్టబోతోందన్నారు. వేయి స్తంభాల గుడి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని.. వేయి స్తంభాల కళా మంటపం పడిపోయినా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. దీనిని డిసెంబర్ నెలలోపు పునరుద్ధిస్తామని హామీనిచ్చారు. వరంగల్ పోర్టుకు సౌండ్ అండ్ సిస్టం కోసం రూ. 5 కోట్లు కేటాయించినట్లు.. త్వరలోనే పనులు ప్రారంభమౌతాయన్నారు.

హైదరాబాద్ నుంచి జగిత్యాల, కరీంనగర్ రోడ్డు కోసం రూ. 2, 174 కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని కిషన్ రెడ్డి ప్రకటించారు. కరీంనగర్ నుంచి వరంగల్ నాలుగు లేన్ల రోడ్డుకు రూ. 4321 కోట్లు, వరంగల్ నుంచి మంచిర్యాల రోడ్డుకు రూ. 4, 137 కోట్లు, వరంగల్ నుంచి ఖమ్మం నాలుగు లేన్ల రోడ్డుకు రూ. 3, 364 కోట్లు… ఇలా అనేక అభివృద్ధికి నిధులు కేటాయించడం జరుగుతోందన్నారు.

హైదరాబాద్ నుంచి వరంగల్ కు వచ్చే రోడ్డుకు రూ. 2,295 కోట్లు, హైదరాబాద్ – యాదాద్రి రోడ్డుకు రూ. 388 కోట్లు, యాదాద్రి నుంచి వరంగల్ కు రూ. 1,907 కోట్లు.. వరంగల్ బైపాస్ రోడ్డు కోసం రూ. 550 కోట్లు, హైదరాబాద్ నుంచి బైపాస్ రోడ్డు వరకు రూ. 2,300 కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందన్నారు. వరంగల్ మున్సిపల్ ఎన్నికల సమయంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తానని అన్నారని, ఏళ్లు గడుస్తున్నా ఎందుకు కట్టించలేదని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కిషన్ రెడ్డి.