జీ20 సదస్సులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాన మోడీ

మొరాకో భూకంప విషాదంపై ప్రధాని మోడీ సంతాపం

PM Modi begins his speech at the G20 summit

న్యూఢిల్లీః భారత్ తొలిసారిగా అతిథ్యమిస్తున్న జీ-20 శిఖరాగ్ర సదస్సు ఢీల్లీ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రపంచ దేశాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సదస్సు ప్రారంభించారు. తన ప్రసంగంతో మోడీ సదస్సును ప్రారంభించారు. ప్రారంభోపన్యాసంలో మోడీ మొరాకోలో సంభవించిన భూకంపంపై స్పందించారు.

మొరాకోలో భూకంపం సంభవించడం చాలా విరాచకరమని ప్రధాని మోడీ అన్నారు. భూకంపంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రకృతి విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో మొరాకోకు భారత్‌ అండగా ఉంటుందని ఆపన్న హస్తం అందించారు.

కాగా, ‘‘మొరాకో భూకంపం అనేక మందిని బలిగొనడం విచారకరం. ఈ కష్ట సమయంలో బాధితుల క్షేమం కోసం భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ అని జీ-20 సదస్సు ముందు మోడీ పోస్ట్ చేశారు. ఘటనలో మరణించిన వారికి సంతాపం తెలిపారు. గాయపడ్డవారు కోలుకోవాలని, ఈ క్లిష్ట సమయంలో మొరాకోకు చేయగలిగిందంతా చేసేందుకు భారత్ రెడీగా ఉందని భరోసా కల్పించారు.

ఇక జీ-20 లో కొత్తగా ఆఫ్రికన్ యూనియన్ కూడా వచ్చి చేరింది. జీ20 దేశాల నేతలు అందరూ సదస్సు వేదిక వద్దకు చేరుకున్నారు. ఆదివారంతో ఈ సదస్సు ముగుస్తుంది. దీనికంటే ముందు అన్ని దేశాలతో కూడిన ఉమ్మడి డిక్లరేషన్ విడుదల కానుంది. సదస్సులో భాగంగా చర్చించి, ఏకాభిప్రాయం కుదిరిన అంశాలకు ప్రకటనలో చోటు లభిస్తుంది. ఈ సదస్సుతో జీ-20కి భారత నాయకత్వం ముగుస్తుంది. 2024 సంవత్సరానికి గాను బ్రెజిల్ జీ-20 అధ్యక్ష స్థానాన్ని అలంకరిస్తుంది. 2025లో దక్షిణాఫ్రికా ఈ బాధ్యతలు నిర్వహించనుంది.