పట్టుదల..అనురాగాల మధ్య అడ్డుగోడ
ఆలుమగల సంసారం

చిన్న చిన్న విషయాలతో మనస్పర్ధలు ప్రేమికుల మధ్య రావడం సాధారణం. తమ మాటే నెగ్గాలని ఇద్దరికి పట్టుదల ఉంటుంది. దాంతో అనురాగాల మధ్య అడ్డుగోడ ఏర్పడుతుంది.
అలా కాకుండా కొంచెం ఆలోచిస్తే తగవులు పెద్దవి కాకుండా ఉండవచ్చు. చాలా సమస్యలకు మాటలు కలపడంతోనే పరిష్కారం లభిస్తుంది.
భాగస్వామితో ఎడబాటు పెరుగుతున్న సమయంలో ఇద్దరిలో ఎవరో ఒకరు చొరవ తీసుకోవాలి.
భావాలను అణచిపెట్టి మౌనంగా ఉండటం కష్టమని ఎదుటి వారికి తెలియజెప్పాలి.
ఒకవేళ మాట కలపకపోతే పరిస్థితి చేయిదాటిపోయే అవకాశం ఉంటుంది. మనసులోని మాటను వ్యక్తపరచడం ఏ బంధంలోనైనా ముఖ్యమే.
అయితే ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఒకరిపై ఒకరు నింద వేయడం మంచిదికాదు.
ఇద్దరి మధ్య ఏర్పడే అగాధం ఇద్దరిని బాధ్యులను చేస్తుంది. ప్రియమైన వారితో వాదనకు దిగడం వల్ల మీరు ఏమనుకుంటున్నారో చెప్పగలరు తప్ప వారు ఏం చెబుతున్నారో వినేందుకు ఆసక్తి చూపరు.
నిజంగా గొడవలు సద్దుమణగాలని అనుకుంటే ముందుగా వారు చెప్పేది ఓపికగా వినాలి. దాంతో సమస్యలకు కారణం తెలుస్తుంది. మీ భాగస్వామిని మరింత అర్ధం చేసుకునేందుకు వీలవుతుంది.
దాంతో ఒకరినొకరు అపార్ధం చేసుకునే అవకాశం తక్కువుంటుంది. మీ జీవితంలో భాగస్వామి విలువను గుర్తించాలి. ఎప్పుడూ వారితో గొడవపడడం, వారి తప్పులను ఎత్తిచూపడమే పనిగా పెట్టుకోవద్దు.
మీకు సహకారం అందించిన సందర్భాలను గుర్తుచేసి మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు చెప్పాలి. ప్రేమను వ్యక్తపరచి, మెచ్చుకోవాలి.
జంటల మధ్య విభేదాలు రావడానికి ప్రధాన కారణం ఒకరినొకరు పట్టించుకోకపోవడం. అలా కాకూడదనుకుంటే మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నం చేయాలి.
వారు మికెంత ప్రత్యేకమో తెలిసేలా చేయాలి. తనే మీ ప్రపంచం అని అర్ధమయ్యేలా ప్రవర్తించాలి.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/