జగన్ గ్రాఫ్ తగ్గిందనే దానిపై పేర్ని నాని కామెంట్స్
ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ అంతకంతకూ తగ్గిపోతోందంటూ టీడీపీ విడుదల చేసిన ఓ సర్వే రిపోర్టుపై మాజీ మంత్రి , ఎమ్మెల్యే పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ తగ్గిందనడం విచిత్రంగా ఉంది. టీడీపీకి రాజకీయ వ్యూహాలు అందిస్తున్న రాబిన్ శర్మ నేతృత్వంలోని సంస్థ వైసీపీకి, వైసీపీ అధినేత వైఎస్ జగన్కు వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వకుండా మరెలా ఇస్తుందని ఆయన ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్ ద్వారా టీడీపీ గ్రాఫ్ పెంచుకోవాలని చూశారు. కానీ, అలా జరగలేదు. తండ్రీకొడుకుల వల్ల గ్రాఫ్ లేవడం లేదు. వైఎస్సార్సీపీ ప్లీనరీ తర్వాత టీడీపీలో ఏం లేదని వాళ్లకు తెలిసిపోయింది. దీంతో, ఇలాంటి సర్వేలను తన జీతగాళ్లతో చేయించుకుని ఆనందపడిపోతున్నారు. మునిగిపోతున్న టీడీపీని కాపాడుకోవడానికి, ప్రజల్లో భ్రమలు కల్పించడానికి బోగస్ సర్వేను బయటకు వదిలారని నాని ధ్వజమెత్తారు. ఇలాంటి సర్వేలు జగన్ గ్రాఫ్ను ఏమీ చేయలేవన్న నాని.. జగన్ గ్రాఫ్ను ఎవరూ తగ్గించలేరని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్ నాయకత్వంపైనా ప్రజల్లో బలమైన నమ్మకం, విశ్వాసం ఉన్నాయని నాని పేర్కొన్నారు.