ఏలూరు జిల్లా కలెక్టర్ పై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం

ఏలూరు జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఉన్నతాధికారులపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి కృష్ణా జెడ్పీ సమావేశాలకు ఏలూరు జిల్లా కలెక్టర్ తరచూ గైర్హాజరవుతున్నారని పేర్ని నాని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసలు జెడ్పీ మీటింగ్ లకు వచ్చే ఉద్దేశం కలెక్టర్ కు ఉందా లేదా? అని ఆయన ప్రశ్నించారు. ఇంత నిర్లక్ష్యం పనికిరాదంటూ మండిపడ్డారు. మీటింగ్ లకు వచ్చే ఉద్దేశం వారికి లేకపోతే జెడ్పీటీసీలతో కలిసి సీఎం ఇంటి ముందు నిరసన తెలియజేస్తామని, ఈ మేరకు కలెక్టర్ కు లేఖ రాయాలని జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారికను డిమాండ్ చేశారు.

గతంలో కృష్ణా జిల్లాలో ఉన్న కైకలూరు, నూజివీడు నియోజకవర్గాలు జిల్లాల విభజన తర్వాత ప్రస్తుతం ఏలూరు జిల్లాలో భాగంగా ఉన్నాయి. కాబట్టి ఉమ్మడి కృష్ణా జెడ్పీ సమావేశానికి ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కూడా హాజరు కావాల్సి ఉంది. గతంలోనూ ఆయన జెడ్పీ సర్వసభ్య సమావేశానికి హాజరు కాలేదు. దీంతో ఇవాళ్టి సమావేశానికి కూడా రాకపోవడంతో పేర్ని నాని అగ్రహం వ్యక్తం చేశారు.