మీడియా కు ఫేర్వెల్ పార్టీ ఇచ్చిన పేర్ని నాని

ఏపీలో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రులు ఈరోజు రాజీనామా చేయబోతున్నారు. ఈ తరుణంలో పేర్ని నాని మీడియా కు విందు ఏర్పాటు చేసి మీడియా ప్రతినిధులను ఖుషి చేశారు. ఈ విందులో మంత్రులు బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. తనకు ఊపిరి ఉన్నంత వరకు మీడియాను గుర్తుపెట్టుకుంటానని తెలిపారు. తనకు మీడియా చేసిన సహాయం అమోఘమని, ఈ మూడేళ్ళలో మీడియా మిత్రులు అందరినీ పేరుతో పిలిచేంత దగ్గరయ్యానని పేర్కొన్నారు.

మరోపక్క వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో ఏపీ కేబినెట్‌ సమావేశం జరుగుతుంది. ప్రస్తుత మంత్రులకు ఇదే చివరి కేబినెట్‌ భేటీ కావడంతో మంత్రులంతా ఫుల్ జోష్ లో హడావిడి గా కనిపించారు. కేబినెట్‌ భేటీ తర్వాత మంత్రులు రాజీనామా సమర్పించే అవకాశం ఉంది. ఈ నెల 11న కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త మంత్రి వర్గానికి సంబంధించిన జాబితా ఈ నెల 10న వెలువడే అవకాశం ఉంది. మరి ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయో చూడాలి.