రేపు ప్రధానికి తో జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ..
ప్రధాని మోడీ రేపు ఏపీలో పర్యటించబోతున్నారు. విశాఖలో రెండు రోజుల పాటు ప్రధాని పర్యటన కొనసాగనుంది. ఈ క్రమంలో రేపు ప్రధాని మోడీ తో జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో రాష్ట్రంలో పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశముందని తెలుస్తోంది. శుక్రవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాన్ విశాఖ కు చేరుకుంటారు. పవన్ కళ్యాన్ రెండు రోజుల పాటు విశాఖలో పర్యటిస్తారని జనసేన వర్గాలు తెలిపాయి. అయితే, విశాఖలో బీజేపీ నిర్వహించే ర్యాలీలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారా? లేదా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇక మోడీ పర్యటన విషయానికి వస్తే..ఈ నెల 11న రాత్రి మోడీ విశాఖ కు చేరుకుంటారు. విశాఖ కు చేరుకోగానే రోడ్ షో లో పాల్గొననున్నారు. కంచెర్లపాలెం నుంచి ఓల్డ్ ఐటీఐ వరకు కిలో మీటర్ మేర ఈ రోడ్ షో ఉండనుంది. 11న రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రధాని మోదీ రోడ్ షో జరుగుతుందని.. ఆ తర్వాత, ఐఎన్ఎస్ చోళలో బస చేస్తారని ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు.
ఈ నెల 12న 9 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని.. అవన్నీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులేనని ఎంపీ జీవీఎల్ చెప్పారు. ఇందులో రూ. 152 కోట్లతో చేపట్టే విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ ముఖ్యమైందన్నారు. లక్షకు పైగా మత్స్యకార కుటుంబాలకు ఇదొక వరం లాంటిదని పేర్కొన్నారు. అలాగే, రాయ్పూర్- విశాఖ ఎకనామిక్ కారిడార్, విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలా నగర్ వరకు డైరెక్ట్ రోడ్, గైయిల్ ద్వారా శ్రీకాకుళం నుంచి ఒడిశాలోని ఒంగుల్ వరకు పైప్ లైన్ నిర్మాణం, గుంతకల్లులో ఐవోసీఎల్ చేపడుతున్న ప్రాజెక్ట్ను జాతికి అంకితం చెయ్యడం లాంటివి ఉన్నాయని జీవీఎల్ వివరించారు.