జగన్ ఫై వరుస ట్వీట్స్ తో విరుచుకుపడ్డ పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ సీఎం జగన్ ను టార్గెట్ చేసారు. వరుస ట్వీట్స్ తో విరుచుకపడ్డారు. అన్నమయ్య డ్యాం విషయంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఫైర్ అయ్యారు.

అణచివేసే వారే.. అణచివేతకు గురైనవారిలా మాట్లాడటం విడ్డూరం అని.. నా కామెంట్లపై సందేహాలు ఉంటే, ఏపీ మానవ హక్కుల సంఘాలను సంప్రదించండని కోరారు. 19.11.2021 తేదీన తెల్లవారుజామున కురిసిన అతి భారీ వర్షాలకు అన్నమయ్య డ్యాం తెగిపోయిందని.. హఠాత్తుగా సంభవించిన ఈ వరద వల్ల.. ఒడ్డున ఉన్న మందపల్లి, తొగురుపేట, పులపత్తూరు మరియు గుండ్లూరు గ్రామాలలోని 33 మంది ప్రజలు జల సమాధి అయ్యారని తెలిపారు.

కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్ రాజ్యసభలో ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని స్పష్టంగా చెప్పారని.. అంతర్జాతీయంగా ఈ ఘటన మీద అధ్యయనం జరిగితే మన దేశ ప్రతిష్టకు భంగం కలుగుతుంది అని వాపోయారని వివరించారు. అలాగే క్లాస్ వార్ అంటూ జగన్ చేసిన కామెంట్ల మీద పవన్ సెటైర్లు వేశారు. అధికారికంగా రూ. 500 కోట్ల విలువైన ఏపీ సీఎం నిరంతరం కార్ల్ మార్క్స్ లా క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నారని.. కార్ల్ మార్క్స్ లాగా ‘వర్గ యుద్ధం’ జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.