దర్శి బస్సు ప్రమాదం ..తీవ్ర విచారం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్

మానవ తప్పిదమా? బస్సు కండిషన్ సరిగా లేదా? అనేది తేల్చాలని స్పష్టీకరణ

pawan-kalyan-express-grief-on-darshi-bus-accident

అమరావతిః ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఓ పెళ్లి బస్సు సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో ఏడుగురు మృత్యువాతపడడం తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. పెళ్లి బృందంతో వెళుతున్న ఆర్టీసీ బస్సు సాగర్ కెనాల్ లో పడిపోయిన ఘటనలో ఏడుగురు చనిపోయారని, 12 మంది గాయపడ్డారని తెలిసి చాలా బాధ కలిగిందని తెలిపారు. ఎంతో వేడుకగా పెళ్లి ముగించుకుని కాకినాడలో రిసెప్షన్ కోసం వెళుతున్న ముస్లిం కుటుంబాలకు చెందిన వారు ఈ ప్రమాదంలో మరణించడం అత్యంత విచారకరమైన విషయం అని పేర్కొన్నారు.

గత అర్ధరాత్రి జరిగిన ఈ దుర్ఘటన మానవ తప్పిదమా? లేక ఆర్టీసీ బస్సు సాంకేతిక స్థితి సక్రమంగా లేదా అనే విషయమై అధికారులు దర్యాప్తు చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని వివరించారు. క్షతగాత్రులకు మేలైన వైద్య సదుపాయం కలిగించడంతో పాటు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికంగా సాయపడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.