పవన్ భీమవరం పర్యటన వాయిదా..
మరికొద్ది గంటల్లో పవన్ కళ్యాణ్ పర్యటన మొదలుకాబోతుందని జనసేన శ్రేణులు భావిస్తున్న తరుణంలో అధికారులు షాక్ ఇచ్చారు. పవన్ హెలికాఫ్టర్ ల్యాండింగ్ కు అధికారులు అనుమతి ఇవ్వకపోవడం తో పవన్ టూర్ వాయిదా పడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఉభయ గోదావరి జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ ఉభయ గోదావరి జిల్లాలలో పర్యటించేందుకు పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఖరారైంది. షెడ్యూల్లో భాగంగా తొలిరోజు అంటే బుధవారం భీమవరంలో పవన్ కళ్యాణ్ పర్యటించాల్సి ఉంది. కానీ జనసేనకు ఊహించని షాక్ తగిలింది.
పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ల్యాండింగ్కు స్థానిక అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో జనసేనాని భీమవరం పర్యటన వాయిదా పడింది. భీమవరం విష్ణు కాలేజీలో పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు హెలిప్యాడ్ కోసం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్కు జనసేన నేతలు దరఖాస్తు చేశారు. అయితే హెలికాప్టర్ ల్యాండింగ్కు విద్యుత్, రోడ్డు భవనాల శాఖ అధికారులు అనుమతి ఇవ్వలేదు.
దీనిపై జనసేన నేతల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ పర్యటనను అడ్డుకునేందుకే ప్రభుత్వం ఇలా చేయిస్తోందని ఆరోపిస్తున్నారు. హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం హెలిప్యాడ్కై కలెక్టర్, పోలీసులకు దరఖాస్తు చేసినట్లు జనసేన నేతలు చెప్తున్నారు. కలెక్టర్, పోలీసు శాఖ నుంచి సానుకూల స్పందన వచ్చిందనీ.. అయితే విద్యుత్, ఆర్ అండ్ బీ అధికారులు మాత్రం అనుమతి ఇవ్వలేదని చెప్తున్నారు. దీంతో భీమవరం పర్యటన వాయిదా పడిందనీ, ఎప్పుడనేదీ తర్వాత చెప్తామని వెల్లడించారు.