నేడు అబుదాబిలో మొదటి హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోడీ

PM Modi will inaugurate the first Hindu temple in Abu Dhabi today

న్యూఢిల్లీః ప్రస్తుతం యూఏఈ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ నేడు అబుదాబిలో బీఏపీఎస్ సొసైటీ నిర్మించిన హిందూ దేవాలయాన్ని ప్రారంభిస్తారు. 27 ఏకరాల్లో నిర్మించిన ఈ మందిరం అబుదాబిలోని తొలి హిందూ దేవాలయంగా రికార్డు సొంతం చేసుకుంది. యూఏఈలో రెండో అతిపెద్ద హిందూ దేవాలయంగా మరో అరుదైన గుర్తింపు దక్కించుకుంది.

.దుబాయ్-అబుదాబిని కలిపే షెక్ జాయెద్ హైవేకు సమీపంలోని అబూ మారెఖ్ ప్రాంతంలో ఈ మందిరాన్ని నిర్మించారు. ఇందుకు కావాల్సిన స్థలాన్ని యూఏఈ ప్రభుత్వం విరాళంగా ఇచ్చింది.
.2019లో దేవాలయ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.
.ఈ దేవాలయంలోని ప్రార్థనా మందిరంలో ఒకేసారి 3 వేల మంది భక్తులు ప్రార్థనలు చేసుకోవచ్చు. దీంతో పాటు కమ్యూనిటీ సెంటర్, ఎగ్జిబిషన్ హాల్, లైబ్రెరీ, చిన్న పిల్లల పార్కు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు.
.సంప్రదాయిక నగర శైలిలో మందిరాన్ని నిర్మించారు. 108 అడుగుల ఎత్తున్న దేవాలయంపై యూఏఈలోని ఏడు ఎమిరేట్స్‌కు చిహ్నంగా ఏడు శిఖరాలను ఏర్పాటు చేశారు.
.సనాతన ధర్మంలోని ఎనిమిది గొప్ప లక్షణాలకు చిహ్నంగా దేవాలయ ముఖద్వారాలపై ఎనిమిది శిల్పాలను చెక్కారు. గంగా, యమున నదులను గుర్తుకు తెచ్చేలా మందిరం చుట్టు పలు శిల్పకళారూపాలను తీర్చిదిద్దారు.
.మాయ, ఆజ్టెక్, ఈజిప్ట్, అరబిక్, యూరోపియన్, చైనీస్, ఆఫ్రికన్ ప్రాచీన నాగరికతల్లోని కథలను మందిరంలోని గోడలపై చెక్కారు.
.దేశంలోని వివిధ దేవతలకు చెందిన ఏడు విగ్రహాలను కూడా మందిరంలో ఏర్పాటు చేశారు.
.కర్బన్ ఉద్గారాలు తగ్గించుకునేందుకు ఈ దేవాలయ నిర్మాణంలో చాలా భాగం ఫ్లై ఆష్‌ను వాడారు.
.దేవాలయంలో ఉష్ణోగ్రత, ఒత్తిడి తదితర సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు వీలుగా మొత్తం 150 సెన్సర్లను ఏర్పాటు చేశారు.
.బీఏపీఎస్ మందిరం ఇప్పటికే పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. బెస్ట్ మెకానికల్ ప్రాజెక్టు-2019, ఎమ్‌ఈపీ మిడిల్ ఈస్ట్ అవార్డు, బెస్ట్ ఇంటీరియర్ డిజైన్ అవార్డు-2020, బెస్ట్ ఆర్కిటెక్చురల్, బెస్ట్ నగరా స్టైల్ అవార్డులను కూడా దక్కించుకుంది.