ఉప్పొంగుతున్న యమునా..ఢిల్లీకి 2 రోజులు నీళ్లు బంద్
న్యూఢిల్లీ: యమునా నది రికార్డు స్థాయిలో ప్రవహిస్తుంది. దీంతో ఢిల్లీలోని వజీరాబాద్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను మూసివేశారు. యమునా నదిలో నీటి స్థాయి పెరగడంతో ఆ ప్లాంట్ను బంద్ చేశారు. ఇవాళ ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆ ప్లాంట్ను విజిట్ చేశారు. తొలిసారి యమునా నదిలో ఈ స్థాయిలో నీరు వచ్చినట్లు సీఎం కేజ్రీ తెలిపారు. పంపులు, మెషీన్లలోకి నీరు ప్రవేశించడం వల్ల మూడు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను మూసివేసినట్లు ఆయన వెల్లడించారు. దీని కారణంగా ఢిల్లీలో సుమారు 25 శాతం నీటి సరఫరా తగ్గిపోతుందని ఆయన తెలిపారు.
బోర్లను కూడా మూసివేసినట్లు ఆయన చెప్పారు. ఒకటి లేదా రెండు రోజుల పాటు ఢిల్లీలో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం సాయంత్రం తర్వాత మళ్లీ నీటి సరఫరా పునరుద్దరణ జరిగే అవకాశాలు ఉన్నట్లు సీఎం కేజ్రీ వెల్లడించారు. కేంద్ర జల సంఘం ప్రకారం ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు యమునా నది ప్రవాహం హెచ్చ స్థాయికి చేరుకుంటుందని, ఆ తర్వాత నీటి మట్టం తగ్గడం ప్రారంభం అవుతుందని సీఎం తెలిపారు.
ఢిల్లీలో యమునా నీటి మట్టం 208.46 మీటర్ల స్థాయికి చేరుకున్నది. సీఎం కేజ్రీవాల్ ఇంటి చుట్టు కూడా యమునా నది నీరు చేరుకున్నట్లు తెలుస్తోంది. సెక్రటేరియేట్ క్యాంపస్లోనే కేజ్రీవాల్ ఇళ్లు ఉన్నది. ఆ రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు, సీనియర్ అధికారుల ఇండ్లు కూడా అక్కడే ఉన్నాయి. రాజ్ఘాట్ నుంచి సెక్రటేరియ్కు వెళ్తున్న రోడ్డు జలమయం అయ్యింది. యమునా బ్యాంక్ మెట్రో స్టేషన్ను క్లోజ్ చేశారు.